జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

ఠాగూర్

ఆదివారం, 22 జూన్ 2025 (20:40 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల మరోమారు విమర్శలు గుప్పించారు. జగన్ వాహన కిందపడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు చాలా భయానకరంగా ఉన్నాయని, ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. వైకాపా బలప్రదర్శనలకు, హత్యలకు జగన్‌ ఏం సమాధానం చెబుతారంటూ అంటూ ఆమె ప్రశ్నించారు.
 
'కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్‌ కొనసాగించడం ఏంటి? వందమందికి పర్మిషన్‌ ఇస్తే వేలమంది ముందు జగన్‌ చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా? 
 
ఇదేం రాజకీయం.. ఇదెక్కడి రాక్షస ఆనందం. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాలతో శవ రాజకీయాలు చేస్తారా? కారు సైడ్‌ బోర్డ్‌ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్‌ మూవ్‌ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్‌ బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోంది. 
 
బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి జగన్‌ కారణమయ్యారు. పర్మిషన్‌కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఎందుకు నిద్ర పుచ్చారు? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తారు. దీక్షలు భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైకాపా చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెబుతారు? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?’’ అని షర్మిల ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు