పోలీసులపైనే కేసులు.. మదనపల్లె, సీఐ, ఎస్సైలు అరెస్ట్

బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:28 IST)
నేరస్తులపై కేసులు నమోదు కావడం మామూలే. అయితే చిత్తూరు జిల్లాలో ఏకంగా ఎక్సైజ్ సీఐ, ఎస్సెపై కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలోని ఎస్బీఐ కాలనీకి చెందిన నాదెళ్ల వెంకటేశ్వరప్రసాద్‌ రెండున్నరేళ్లుగా పట్టణంలోని ఆనంద్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారన్నారు. 
 
ఇందులో ఎక్సైజ్‌ ప్రభుత్వ మద్యం డిపో సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌‌లకు బార్‌లో వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
ఈ క్రమంలో మద్యం విక్రయాల్లో తేడాలు రావడం.. డిపో నుంచి వైన్‌షాపులకు పంపాల్సిన మద్యాన్ని బార్‌లో ఉంచి అధిక ధరలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. వరుసగా ఇలాంటి విభేదాలతో లీజుదారుల మధ్య ఇటీవల గొడవలు జరగడంతో బార్‌ను మూసి వేశారు. 
 
సీఐ, ఎస్సై అనుచరులు ఆదివారం బార్‌ ఆక్రమణకు ప్రయత్నించడంతో వెంకటేశ్వర ప్రసాద్, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసుల అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
 
వెంకటేశ్వర ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌, ఆయన అనుచరులపై ఆరు సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
ఈ ఐదుగురికి 41 నోటీసులు జారీ చేశారు. బార్‌ వివాదం కేసులో ఎక్సైజ్‌ సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు