ఏపీ ప్రభుత్వ అనుమతి మేరకే సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేయాలి... ఎవరు?

శనివారం, 17 నవంబరు 2018 (17:51 IST)
అమరావతి : ఇటీవల సీబీఐపై వస్తున్న విమర్శల వల్ల న్యాయవాదులు, మేధావుల సూచనల మేరకు జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. సీబీఐ, ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం 1946లో ఏర్పాటైనందున దాని పరిధి ఢిల్లీకి మాత్రమేనని ఏ రాష్ట్రంలో దర్యాప్తు చేయాలన్నా ఆయా రాష్ట్రాల అనుమతి చేసుకోవాలని చినరాజప్ప సూచించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను రద్దు చేస్తున్నట్టు, ఇక నుంచి రాష్ట్రానికి చెందిన ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని హోంమంత్రి తెలిపారు.
 
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సీబీఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వస్తోందని చినరాజప్ప గుర్తుచేశారు. దాన్ని రద్దు చేయడం వల్ల ఇక నుంచి రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తునకు సీబీఐ ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 
 
దీనికి సంబంధించిన జీవో 126ను విడుదల చేశామని చినరాజప్ప వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం కూడా సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను రద్దు చేసిందని హోమంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తు చేసుకునేందుకు మాత్రం సీబీఐ, రాష్ట్ర అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చినరాజప్ప చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు