దీక్ష అక్క‌డే... ప‌డ‌కా అక్క‌డే... కొబ్బరి నీళ్ళు ఇచ్చినా తాగ‌ని బాబు!

శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:04 IST)
మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు వ‌య‌సు 71 ఏళ్ళు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఆయ‌న ఈ వ‌య‌సులో 36 గంట‌ల దీక్ష‌కు కూర్చున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న దీక్ష అక్క‌డే... ప‌డ‌కా అక్క‌డే... టీడీపీ ఆఫీసులో తొలిసారి ఇలా చంద్ర‌బాబు నిర‌స‌న చేయ‌డం అని కార్య‌క‌ర్త‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దీక్ష ప్రారంభించిన స్థలంలోనే చంద్రబాబు రాత్రి నిద్రపోయారు. దీక్ష సందర్భంగా కోబ్బరి నీళ్లు ఇచ్చినా బాబు నిరాకరించారు.
 
టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా, నిరసన దీక్ష ప్రారంభించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఉదయం నుంచి కార్యకర్తల సంఘీభావం పెరుగుతోంది. వైసీపీ శ్రేణులు ఎక్కడయితే విధ్వంసం సృష్టించారో, అక్కడే ఆయన దీక్షకు ఉపక్రమించారు. ఉదయం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చి వెళుతున్నారు. వారిని నియంత్రించడం పార్టీ నేతలకు సాధ్యం కావ‌డంలేదు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించిన కార్యకర్తలు, యువ నేత  లోకేష్‌ను కలసి దీక్షకు మద్దతు ప్రకటించారు. వారితో లోకేష్ ముచ్చటించి గ్రామాల్లో ప్రజల రియాక్షన్ అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీ సీనియర్లు వివిధ జిల్లాల నుంచి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. వివిధ విద్యార్థి సంఘాలు కూడా చంద్రబాబు నిరసన దీక్షకు మద్దతు ప్రకటించాయి.
 
మ‌రో ప‌క్క ఆమ్ ఆద్మీ పార్టీ, క‌మ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబు దీక్ష‌కు మ‌ద్ద‌తు ప‌లికాయి. వారు కూడా దీక్ష శిబిరానికి వ‌చ్చి, చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు  వివిధ జిల్లాల నుంచి వచ్చిన సీనియర్లను, అక్కడి స్పందనను అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్, డిల్లీ ఏపీ భవన్‌లో కూడా చంద్రబాబు ఇదే విధంగా దీక్ష‌లు నిర్వహించారు. 
 
పార్టీ ఆఫీసుపై దాడి... ఇక్క‌డి పరిస్థితిని చూసిన కార్యకర్తలు భావోద్వేగానికి గురువుతున్నారు. దీక్ష తర్వాత చంద్రబాబు సహా పార్టీ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారు. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చనీయాంశం చేసి, వైసీపీ రాక్షసత్వాన్ని చాటతాం’’ అని చంద్రబాబు రాజకీయ సలహాదారు, జాతీయ పార్టీ సమన్వయకర్త టిడి జనార్దన్ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు