నా భార్యను పెళ్లి చేసుకోండి.. మాట్రిమోనిలో భర్త ప్రకటన.. ఎందుకో తెలుసా?

గురువారం, 21 అక్టోబరు 2021 (19:32 IST)
భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు విడిపోయేవరకు కాదు.. తన భార్యను అమ్మకంలో పెట్టేవరకు వచ్చింది. చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అన్నీ ఆలోచించుకున్న తర్వాత విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

ఐతే విడాకులపై విచారణ జరుగుతున్న క్రమంలో అతడు తన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏ భర్తా చేయకూడని పనిచేశాడు. తన భార్యకు సంబంధించిన వివరాలను మాట్రిమోనిలో పోస్ట్ చేసి.. వరుడు కావలెను అని ప్రకటన ఇచ్చాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. తమిళనాడు ఈ ఘటన వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి (32)..  ఓంకుమార్‌(34) అనే యువకుడిని పెళ్లి చేసుకుంది.  2016లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంతలో వీరిద్దరి మధ్య మనస్పర్థలతో విడాకులు సిద్ధమయ్యారు. 
 
ఐతే విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఓంకుమార్ తనలోని నీచ బుద్ధిని బయటపెట్టాడు. రెండు వారాల క్రితం మ్యాట్రిమొని వెబ్‌సైట్లో తన భార్య వివరాలను ఉంచి.. వరుడు కావలెను అని ప్రకటన ఇచ్చాడు. ఎవరికైనా ఆసక్తి ఉంటే యువతి తండ్రిని సంప్రదించాలని ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేశాడు. ఈ విషయాలేవీ ఆ మహిళ తరపు వారికి తెలియవు. కానీ ఇటీవల ఆమె తండ్రికి వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. 
 
మ్యాట్రిమోనిలో యాడ్ పెట్టారు కదా.. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అడుగుతున్నారు.  వారు చెప్పిన విషయాలు విని ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. దీనిపై ఆమె తండ్రి తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆమె వివరాలను మ్యాట్రిమోనిలో పోస్ట్ చేసింది ఓంకుమారేనని పోలీసులు గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు