కర్నాటకలో భాజపాను పడగొట్టింది చంద్రబాబు నాయుడే... ఎవరు?

సోమవారం, 5 నవంబరు 2018 (19:01 IST)
అమరావతి :  ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ప్రధాని మోదీ నాశనం చేశారని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండీ హిదాయత్ సచివాలయంలో విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలోని మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారని, ఆయన నిర్ణయాన్ని హిదాయత్ స్వాగతించారు. మోదీ నియంతృత్వ పాలనను అంతమొందించేందుకు, కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి 5 కోట్ల మంది తెలుగు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని అన్నారు. 
 
నియంత మోదీకి భయపడి ఆయనను ఎదురించేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ లాంటి నేతలు కూడా ముందుకు రాని సమయంలో, సీఎం చంద్రబాబునాయుడు ధైర్యంగా ముందుకు వచ్చారని హిదాయత్ కొనియాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారిని చైతన్య పరచి అక్కడ బీజేపీ అధికారంలోకి రాకుండా చంద్రబాబునాయుడు అడ్డుకోగలిగారని హిదాయత్ గుర్తుచేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వైసీపీ, జనసేన అధినేతలు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. 
 
మోదీ హఠావో...దేశ్ కీ బచావో నినాదంతో ముందుకు వెళతామని హిదాయత్ ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌవరం దెబ్బతిన్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని అప్పటి గవర్నర్ రామ్ లాల్ ఉదంతం తెలియజేస్తోందని, ఇప్పుడు మరోసారి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు సీఎం చంద్రబాబునాయుడు ముందుకు వచ్చారని హిదాయత్ గుర్తుచేశారు. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, కుట్రలు పన్నుతున్నా వైసీపీ, జనసేన అధినేతలు వెన్నెముకలేని వారిగా వ్యవహరిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. 
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని నిర్వీర్యం చేసినా వైసీపీ, జనసేన నేతలు నోరు మెదపడం లేదని హిదాయత్ దుయ్యబట్టారు. అసెంబ్లీ, లోక్ సభల నుంచి పారిపోయిన వైసీపీకి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే భాద్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడే ఉద్యమానికి సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారని, ఈ ఉధ్యమానికి అందరూ మద్దతు పలికి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడుకోవాలని హిదాయత్ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు