ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తారా? ఇదేంది 'బాబు' గోరూ....

గురువారం, 29 జూన్ 2017 (02:48 IST)
తెలుగుదేశం పార్టీలో నాయకుల నాలుక మడతపడటం, నోరు జారడం అధినేత నుంచి ఆయన తనయుడినుంచి కింది స్థాయి నేతల వరకు అలవాటుగా మారుతున్నట్లు అనిపిస్తోంది. ఏమాట జారితే ఏమొస్తుందో ఎరుక లేకుండా తడబడటం ఇప్పుడు రోజువారీ వ్యవహారమైపోయింది. మీడియోను చూసి తత్తరపడుతున్నారో లేక ఏ మాట్లాడితే ఏం. మేమింతే అంటూ ఆవిధంగా ముందుకెళుతున్నారో తెలీదు కానీ అంటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు ఆయన తనయుడు లోకేశ్ బాబు ఇద్దరూ మాట్లాడుతున్న మాటలు జనంకు బాగా తమాషా పంచుతున్నాయి. 
 
బుధవారం విజయవాడలో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ సన్మాన సభలోనూ చంద్రబాబు అలవాటు ప్రకారమే భారీ ప్రసంగం చేశారు. మాటల మధ్యలో ‘నోబెల్‌ ప్రైజ్‌’ గురించి బాబు చేసిన వ్యాఖ్యలపై షల్‌మీడియాలో ప్రస్తుతం విపరీతమైన జోక్స్‌ పేలుతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ‘మన పిల్లలు ఒలింపిక్స్‌లో గెలవాలి. గెలిచేవరకు గట్టిగా ప్రాక్టీస్‌ చేయాలి. మొదటిస్థానంలో ఎవరు నిలుస్తారో వాళ్లకి నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తా. ఇదే విజయవాడలో సన్మానం చేస్తా. అదే నా ఆశ, ఆశయం..’ అని అన్నారు.
 
గతంలోనూ ఓసారి నోబెల్‌ ఇస్తానన్న చంద్రబాబుపై ఏ రేంజ్‌లో సెటైర్లు పేలాయో తెలిసిందే. ఇప్పుడు ఆయనే మరో అడుగుముందుకేసి.. ఒలింపిక్స్‌లో గెలిచినవాళ్లకు నోబెల్‌ ఇస్తాననడం మరీ దారుణం. ఇదే విషయాన్ని నెటిజన్లు సైతం తప్పుపడుతున్నారు. 
 
బుధవారం సాయంత్రం చంద్రబాబు ‘నోబెల్‌’ వ్యాఖ్యలు చేయడానికి కొద్ది గంటల ముందే ఆయన తనయుడు లోకేశ్‌.. ‘టీడీపీ నుంచి ప్రధానిగా ఎన్నికైన గొప్ప నేత పీవీ నరసింహారావు..’ అంటూ మాజీ ప్రధానికి నివాళులు అర్పించడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
 
‘శాంతి, సాహిత్యం, సైన్స్‌ రంగాల నిపుణులకు మాత్రమే అందించే నోబెల్‌ పురస్కారాన్ని.. క్రీడాకారులకు సైతం ఇస్తానంటున్న బాబును ఏమనాలి’ అని ప్రశ్నిస్తున్నారు. మరొకరైతే కాస్త ఘాటుగా.. ‘బాబుగారిని జలీల్‌ ఖాన్‌కు అన్నయ్య అందామంటే ఆల్రెడీ లోకేశ్‌ ఉన్నారు. కాబట్టి తాతని అనొచ్చేమో!’ అని కామెంట్‌ చేశారు.
 
బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దేశవ్యాప్తంగా నెటజన్ల వ్యాఖ్యలకు కేంద్రబిందువు కాగా ఇప్పుడు చంద్రబాుబు, ఆయన తనయుడు జలీల్‌కి మించిన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోవడం ఆశ్చర్యం గొలుపుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోబెల్ ఏ సందర్భంలో ఇస్తారో కూడా తెలీనట్లుగా మాట్లాడటం  ఏమిటి. సందర్బం వస్తే చాలు ఏదంటే అది మాట్లాడటమేనా అని సోడల్ మీడియా వాపోతోంది.
 

వెబ్దునియా పై చదవండి