హెల్త్ బులిటెన్ లెక్కలన్నీ బోగస్సే : చంద్రబాబు ఫైర్

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామన ఏపీ సర్కారు చెబుతోంది. దానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తోంది. కానీ, ఈ లెక్కలన్నీ బూటకమేనని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. 
 
నిజానికి కరోనా వైరస్‌ పరీక్షల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచినట్టు అధికార పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ప్రతి 10 లక్షల మందికి సగటున చేస్తున్న పరీక్షల్లో ముందంజలో ఉంది. దేశంలో సగటున 10 లక్షల మందికి 198 పరీక్షలు చేస్తుంటే.. ఏపీలో 331 టెస్టులు చేస్తున్నారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో రోజుకు 3వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటివరకు మొత్తంగా 16,550 మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపింది.
 
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మీడియాతో స్పందిస్తూ, ఏప్రీ ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యలపై అవాస్తవాలు చెబుతోందంటూ మండిపడ్డారు. కరోనా పరీక్షలపై కేంద్రానికి, ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా యంత్రాంగాలు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు తేడాలున్నాయని ఆరోపించారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారని, కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లను బోగస్ అంకెలతో నింపేస్తున్నారని విమర్శించారు.
 
సీఎం డ్యాష్ బోర్డు అంకెలకు, ఆరోగ్యశాఖ కార్యదర్శి లెక్కలకు పొంతనలేదని, బుధవారం సాయంత్రం 11,613 శాంపిల్స్ పరీక్ష చేసినట్టు డ్యాష్ బోర్టులో పేర్కొన్నారని, గురవారం ఉదయానికి 20,235 పరీక్షలు చేసినట్టు చూపించారని చంద్రబాబు ఆరోపించారు. 12 గంటల వ్యవధిలో 8,622 పరీక్షలు ఎలా చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 7 ల్యాబ్‌లలో రోజుకు 990 పరీక్షలు చేస్తామని మీరే చెప్పారు... మరి ఒక్కసారిగా ఇన్ని పరీక్షలు ఎక్కడ చేశారో చెప్పాలి? అంటూ ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు