30 మంది యువతులకు మాయగాడు టోకరా

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:15 IST)
మ్యాట్రిమోనియలోని 30 మంది యువతులను ట్రాప్‌ చేసి వారివద్దనుండి రూ.కోట్ల నగదును కాజేశాడు మాయగాడు. ఆ మహామాయగాడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజుల క్రితం ఎన్‌.ఆర్‌.పేటకు చెందిన ఓ యువతికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికల పూడికి చెందిన శ్రీనివాస్‌ ఫోన్‌ చేశాడు.

మీ మ్యాట్రిమోనియల్‌ ప్రొఫైల్‌ చూశాను.. నచ్చావు.. పెళ్లి చేసుకుంటా.. అని నమ్మించాడు. కొద్దిరోజులు ఆమెతో మాటలు కలిపి తనకు నగదు అవసరమని చెప్పి మదనపల్లెలోని మరో యువతి ఖాతాకు నగదును పంపాలని కోరాడు. ఆమె రెండుసార్లు రూ.1.35 లక్షలు పంపింది.

ఆ మరుసటిరోజు నుంచే అతని ఫోన్‌ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే చిత్తూరు డిఎస్‌పి సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మదనపల్లె యువతి ఖాతాను పరిశీలించగా ఆమె సైతం అతడి ఖాతాకు రూ.7లక్షలు పంపినట్లు నిర్థారణ అయ్యింది.

అతడు హైదరాబాద్‌, వైజాగ్‌, చెన్నై, బెంగళూరు, పుణె, ఇతర ప్రాంతాలకు చెందిన యువతులను ఇదేవిధంగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒంగోలుకు చెందిన మరో యువతితో బ్యాంకులో రూ.27 లక్షలకు లోన్‌ పెట్టించి, వాటిని తీసుకుని ఉడాయించినట్లు తేలింది.

అతడిపై పోలీసు ప్రత్యేక బృందం నిఘా పెట్టింది. పక్కా సమాచారంతో చిత్తూరు నగర శివారులోని మురకంబట్టులో తనిఖీలు చేస్తుండగా... అనుమానాస్పద వ్యక్తి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

శ్రీనివాస్‌ ఇప్పటివరకు 30 మంది యువతులను మోసం చేసి రూ.కోట్లలో నగదు కాజేసినట్లు స్పష్టమయ్యింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు