'వేలూరు కింగ్' శేఖర్ రెడ్డి మామూలోడు కాదు... ఇంటి ముందు కారులో రూ.24 కోట్లు, పదవి గోవిందా....

శనివారం, 10 డిశెంబరు 2016 (13:51 IST)
అబ్బ... శేఖర్ రెడ్డి ఇంటి ముందు డబ్బు, ఇంట్లో డబ్బు, ఆయన కారులో డబ్బు, ఆయనకు తెలిసినోళ్ల దగ్గర డబ్బు, స్నేహితుల వద్ద డబ్బు... డబ్బే డబ్బు. కోట్లలో డబ్బు. శేఖర్ రెడ్డికి పరిచయమున్న వారిని పట్టుకుంటే డబ్బు. ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది తనిఖీల్లో వెలుగుచూస్తున్న వాస్తావాలివి. శేఖర్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలతోపాటు శనివారం నాడు వేలూరులోని ఆయన స్వగృహంలోనూ ఐటీ దాడులు జరిగాయి. 
 
ఐతే ఆయన ఇంటి ముందు ఆపి ఉంచిన ఓ కారును తెరిచి చూస్తే అందులో రూ. 24 కోట్ల వెలుగుచూశాయి. అన్నీ రూ.2000 కొత్త నోట్లే. శేఖర్ రెడ్డి ఈ స్థాయిలో డబ్బు బయటపడటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శేఖర్ రెడ్డి తొలుత మైనింగ్ కార్యకలాపాలతో కోట్ల డబ్బును ఆర్జించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మెల్లిగా తన ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయాల్లో కాలు మోపి, తమిళనాడు అధికార పార్టీకి మొన్నటి ఎన్నికల్లో కోట్లలో ధనాన్ని ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 
 
పార్టీకి దన్నుగా ఉన్న శేఖర్ రెడ్డి తితిదే బోర్డు సభ్యుడి పదవి కావాలని అడగడమూ, జయ సిఫార్సు చేయడమూ చకచకా జరిగిపోయాయి. ఐతే శశికళ వ్యాపారాలకు శేఖర్ రెడ్డి బినామీగా ఆయన వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శేఖర్ రెడ్డి నుంచి రూ. 104 కోట్ల నగదు, రూ. 100 కిలోలకు పైగా బంగారాన్ని ఐటీ స్వాధీనం చేసుకుంది. వీటన్నిటికీ లెక్కలు లేకపోవడంతో కేసును సీబీఐకి అప్పజెప్పే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
మరోవైపు చెన్నైలో భారీగా అక్రమాస్తులు వెలుగుచూడటంతో శేఖర్ రెడ్డిని తితిదే బోర్డు నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శేఖర్ రెడ్డిని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తమ్మీద శేఖర్ రెడ్డి ఆస్తుల వ్యవహారం దేశంలో సంచలనం కలిగిస్తోంది.

వెబ్దునియా పై చదవండి