మెగా బ్రదర్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడారు?

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (11:38 IST)
ఏపీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి, అగ్ర నటులు ఇలా అనేక మంది హాజరయ్యారు. అయితే, ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. వారిద్దరితో కలిసి అభివాదం చేశారు. స్టేజ్‌‌పై ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చిన మోడీ, మెగా బ్రదర్స్‌ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయన ఏం మాట్లాడారో చిరు పోస్ట్‌ పెట్టారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్‌తో ప్రధాని మోడీ ఏదో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
'నాతో, తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోడీ గారు వేదికపై మాట్లాడడం చాలా ఆనందానిచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్లు చెప్పారు. కుటుంబసభ్యులు.. ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయన్నారు. ఆ దృశ్యాలు మన సంస్కృతిసంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని అభినందించారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రధాని మాతో అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోడీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం' అని చిరు పేర్కొన్నారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్‌ను నెటిజన్లు, అభిమానులు షేర్‌ చేస్తున్నారు.  
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు