చీరలు దొంగతనం చేసిన చిత్తూరు గస్తీ పోలీసులు

శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:49 IST)
రాత్రి వేళల్లో పట్టణాల్లో దొంగతనాలు జరుగకుండా పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. దీంతో దొంగలు చోరీ చేసేందుకు భయపడుతుంటారు. కానీ, పోలీసులే దొంగలుగా మారి చోరీలు చేస్తే... మరి ప్రజల ఆస్తులకు ఎవరు రక్షణ కల్పిస్తారు. చిత్తూరు జిల్లాలో పోలీసులే చోరీ చేస్తూ పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి.
 
ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి స‌మ‌యంలో రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న బట్టల దుకాణంలో చోరీ చేశారు. ఇద్దరు పోలీసులు దుకాణం వ‌ద్దే స్కూటర్ ఆపి, ఫుట్‌పాత్‌పై ఉండే వస్త్ర దుకాణంలోకి వెళ్లి దుస్తులు తీసుకుని వెళ్లిపోయారు. చోరీ జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా ద్వారా ఈ విష‌యం బయట పడింది. 
 
పోలీసుల‌పై దుకాణ‌ యజమాని పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దుస్తులు చోరీ చేసింది ఏఆర్ కానిస్టేబుల్ అని, అత‌డికి సాయం చేసిన‌ మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని అధికారులు నిర్ధారించారు. అయితే, ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. చివ‌ర‌కు మీడియాకు ఈ సీసీ దృశ్యాలు చిక్క‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు