సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు!!

వరుణ్

ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (17:34 IST)
ఏపీ సీఎం, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటనపై దర్యాప్తునకు  పోలీసులు ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. విజయవాడ సెంట్రల్‌ నిజయోకవర్గం అజిత్ సింగ్ నగర్‌‍లోని వివేకానంద స్కూల్‌ దగ్గర ఈ దాడి జరగడంతో సెంట్రల్ భవనంపై నుంచి దాడి జరిగివుండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీఫుటేజ్‌లను చెక్ చేస్తున్నారు. 
 
అలాగే, సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేశారు. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్ధం విధించారు. మరీ అవసరమైతేనే జగన్ బస్సు పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తల అనుమతి ఇవ్వాలని సూచించారు. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలను తగ్గించాలని సూచించారు. జగన్మోహన్‌‍కు జనానికి మధ్య బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని సూచన కోరారు. సభల్లో ర్యాంప్ వాక్ చేయొద్దని జగన్‌కు భద్రతాపరమైన సూచనలు చేశారు. వీలైనత వరకు బస్సులో కూర్చునే రోడ్ షో నిర్వహించాలన్న నిఘావర్గాలు పేర్కొన్నాయి. 
 
కాగా, వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్ల ప్రాంతం నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుడివైపు ఇళ్లు ఉండటంతో ఎడమవైపు ఉన్న స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. 30 అడుగుల దూరం నుంచి అగంతకుడు దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు, పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు