మోదీపై అంత విశ్వాసం వుంటే.. ఇక అవిశ్వాసం ఎందుకయ్యా?: బాబు

సోమవారం, 12 మార్చి 2018 (09:00 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం తనకుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీపై అంత విశ్వాసం వుంటే ఇక అవిశ్వాసం పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పార్లమెంట్ వేదికగా చేపట్టాల్సిన నిరసనలు, కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలన్న అంశాలపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా వైకాపాపై చంద్రబాబు మండిపడ్డారు. మోదీపై కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఓ వైపు విశ్వాసం, మరోవైపు అవిశ్వాసం అంటూ డొంకతిరుగుడు మాటలెందుకని ధ్వజమెత్తారు. హోదా విషయంలో టీడీపీ వైఖరి సుస్పష్టమని, రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని బాబు తెలిపారు.
 
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు దమ్ముంటే.. బీజేపీతో పొత్తు వుంటుందా? వుండదా? చెప్పాలని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో లాలూచీ పడిన జగన్, ఇప్పటికే లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
 
కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి వంత పాడుతున్నాడని మండిపడ్డారు. వైకాపా ప్రజా సెంటిమెంట్‌తో ముడిపడిన ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయం చేస్తోందని, అందుకు ప్రజలే బుద్ధి చెబుతారని ప్రత్తిపాటి హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు