ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలన్నింటికీ ఒకే పోర్టల్

గురువారం, 27 జనవరి 2022 (14:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలన్నింటికీ ఒకే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ సేవ పేరుతో ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు పోర్టల్‌ను తీసుకొచ్చామని చెప్పారు. సిటిజెన్స్ సర్వీసెస్ పోర్టల్‌ను ప్రారంభించామని, దీనికి ఏపీ సేవ అనే పేరును పెట్టామని తెలిపారు. 
 
మారుమూల గ్రామాల్లో సైతం వేగంగా, పారదర్శకంగా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలు పొందేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. మనకున్న వ్యవస్థను మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగానే ముందడుగు అని చెప్పారు. 
 
గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో అందరికీ తెలిసేనా గత రెండేళ్ళ కాలంలో అడుగులు ముందుకే వేశామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సేవలను అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రజల సేవలో 4 లక్షల మంది సిబ్బంది ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమైవున్నారని, గ్రామస్వరాజ్యానికి ఇంతకంటే నిదర్శనం లేదని సీఎం జగన్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు