ఏపీలో వైఎస్ఆర్ జలకళ : ఉచిత బోరు బావులు తవ్విస్తాం : సీఎం జగన్

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జలకళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్లు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు. మొదటి బోరు విఫలమైతే రెండోసారి బోరు వేయాలని అధికారులకు స్పష్టం చేశామని చెప్పారు. బోరు వేసేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, ఉచిత బోరు కోసం రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. 
 
లేకపోతే, రైతులు తమ ప్రాంతంలోని వలంటీర్ సాయంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు బోర్లతో పాటు మోటార్లు కూడా బిగిస్తామన్నారు. 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ ప్రాంతాల్లో వైఎస్సార్ జలకళ పథకం అమలు చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు వేసే యంత్రాన్ని అందుబాటులో ఉంచుతామని వివరించారు.
 
ఈ వైఎస్ఆర్ జలకళ కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయబోతుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్‌ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నేడు నెరవేర్చారు. 
 
అలాగే, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. సోలార్‌ ఉత్పత్తి ద్వారా యూనిట్‌ రూ.2.30కే అందుబాటులోకి వస్తుంది. రైతులపై విద్యుత్‌ భారం మోపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిని రైతులే నిలదీస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో జనతాబజార్ తీసుకొస్తాం.’అని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు