ఏపీ రైతులను నిలువునా ముంచేసిన నివర్ తుఫాన్, 2 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట

శనివారం, 28 నవంబరు 2020 (13:15 IST)
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 2,14,420 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశకు వచ్చిన వరి పంట నీట మునిగిపోయింది. చేతికి అందివచ్చిన మినుము ఇతర మెట్ట పంటలు వర్షపు నీటిలో మునిగిపోయాయి.
 
ఒక్క గుంటూరు జిల్లాలోనే లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల హెక్టార్లలో మినుము దెబ్బతింది. ప్రకాశం జిల్లాలో 3వేల 650 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 11 జిల్లాల్లో 1,89,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది.
నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో శనివారం నాడు ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసిన అనంతరం రేణిగుంటలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని పంట నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు