'నివర్' దడ... తెలంగాణా జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్.. హైదరాబాద్‌లో మళ్లీ వర్షాలు!

బుధవారం, 25 నవంబరు 2020 (10:52 IST)
తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమైన నివర్ తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడనుంది. ఈ తుఫాను బుధవారం రాత్రి 8 - 9 గంటల మధ్యలో తీరందాటనుంది. 
 
తీరందాటిన తర్వాత ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణితో కలిసి తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నివర్ తుఫాను తీరాన్ని దాటుతూ, ఆపై రాయలసీమ, కర్ణాటకల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్న భారత వాతావరణ శాఖ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరంజ్ ఎలర్ట్‌ను ప్రకటించింది.
 
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాల్లో 26వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని, 27న మిగతా చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ దక్షిణ, వాయవ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, ఈ విషయంలో పూర్తి అంచనాకు రావాలంటే, గురువారం తుఫాను గమనాన్ని పరిశీలించాల్సి వుంటుందని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు.
 
నివర్ తుఫానుతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒకటి నుంచి మూడు డిగ్రీలకు పడిపోతాయని, ఈ ప్రభావం 29 వరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఐఎండీ నుంచి వచ్చిన సూచనలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు అలర్ట్ అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు