నెల్లూరు : గ్రామాల మధ్య కరోనా కొట్లాట... ఎక్కడ?

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:09 IST)
మహమ్మారి కరోనా వైరస్ కేవలం మనుషుల ప్రాణాలను హరిస్తోంది. ఈ వైరస్ ధాటికి చనిపోతున్న వారిని ఖననం చేసేందుకు చివరకు కుటుంబ సభ్యులు కూడా రావడం లేదు. ఇలా మానవ సంబంధాలను తెంచేసింది. ఇపుడు గ్రామాల మధ్య చిచ్చుపెడుతోంది. ఒక గ్రామంలో వైరస్ సోకిందని నిర్ధారణ అయితే ఆ గ్రామ ప్రజలు మరో గ్రామంలోకి ప్రవేసించకుండా ముళ్ల కంచెలు వేస్తున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో రెండు గ్రామాల మధ్య కరోనా కొట్లాట జరిగింది.
 
ఘర్షణ పడిన రెండు గ్రామాల ఊర్ల పేర్లు తెలియకపోయినప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్థానికులు ఒక గ్రామంలో కంచె ఏర్పాటు చేశారు. అయితే కంచె ఏర్పాటుతో రెండో గ్రామంలోకి వెళ్లేందుకు దారి లేదు. దీంతో రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.  
 
మరోవైపు, జిల్లాలో ఒక్కరోజు వ్యవధిలోనే 29 కేసులో నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు మొత్తం 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 71 మంది శాంపిల్స్ పరీక్షలకు పంపారు. రెడ్ జోన్ పరిధిలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా.. ఇళ్లవద్దకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం జిల్లాలో సుమారు రెండువేల పడకలను సిద్ధం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు