సీపీఎం నేత బాబూరావు హౌస్‌ అరెస్ట్‌

గురువారం, 1 అక్టోబరు 2020 (09:59 IST)
ఏపీ వ్యాప్త ఆందోళనకు భవన నిర్మాణ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. నిరసనలో పాల్గొనేందుకు వెళుతున్న సీపీఎం నేత బాబూరావు ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

గురువారం ఉదయం విజయవాడ మాచవరం పోలీసులు సీపీఎం నేత బాబూరావు ఇంటికి వచ్చి సెక్షన్‌ 144, 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూ.. నోటీసులు జారీ చేసి హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

బయటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు మోహరించి ఉన్నారు. పలుచోట్ల సీపీఎం, సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాల నాయకులకు పోలీసులు నోటీసులను జారీ చేసి నిర్బంధించారు.
 
బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక, కరోనాతో పనులు లేక ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం స్పందించలేదన్నారు. పైపెచ్చు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి 450 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం తన సొంత అవసరాలకు మళ్లించుకుందని ఆరోపించారు.

వైసిపి సర్కార్‌ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నిర్బంధంతో ఉద్యమాలని అణిచివేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణమే రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.

సంక్షేమ నిధి నుంచి మళ్లించిన డబ్బును మళ్లీ సంక్షేమ నిధి లోనే జమ చేయాలని, కార్మికుల సంక్షేమానికి వాటిని వినియోగించాలని చెప్పారు. విజయవాడలో 144, 30 వ సెక్షన్‌ ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నామని బాబూరావు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు