గులాబ్ గుబులు - పలు రైళ్లు రద్దు - అప్రమత్తమైన అధికారులు

ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:38 IST)
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. ఈ తుఫానుకు గులాబ్‌ అనే పేరును పాకిస్థాన్ ఖరారు చేసింది. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఆదివారం సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరందాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఏపీ, ఒడిశాలోని పలు ప్రాంతాలకు తుపాను హెచ్చరికలు జారీ చేసింది.
 
ముఖ్యంగా, తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. 
 
ఇప్పటికే ఏపీ, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. 
 
ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలతో పాటు.. బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే, లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు