నేను పార్టీలో వుండటం ఇష్టం లేకపోతే.. సస్పెండ్ చేయండి: డీఎస్

మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (16:41 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌ ఘాటు లేఖ రాశారు. పార్టీ అధిష్ఠానికి రాసిన ఈ బహిరంగ లేఖలో.. తాను పార్టీలో వుండటం ఇష్టం లేకపోతే, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. తాను పార్టీని వదిలితే కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని, దయచేసి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. 
 
పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేశానో పార్టీ చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు. తానెప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడానో చెప్పాలని డిమాండ్ చేశారు. మనసులో ఏదో పెట్టుకొని నిరాధారమైన ఆరోపణలు చేసి, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని డీఎస్ మండిపడ్డారు. లేనిపోనివి కల్పించుకొని... సంజయ్‌పై కేసు పెట్టి కుటుంబాన్ని రోడ్డుకు ఇడ్చారని లేఖలో పేర్కొన్నారు. 
 
మరోవైపు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కారు దిగడం ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌లో తన ప్రధాన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి డీఎస్ అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారని టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు