విజయసాయిపై పీఎంవో సీరియస్... ఢిల్లీలికి పిలిచిమరీ చీవాట్లు

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (11:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల ఆశీస్సులతోనే అన్నీ చేస్తున్నట్టు ఇటీవల వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వెళ్లాయి. ముఖ్యంగా, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇటీవల టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పీఎంవో అధికారుల చెవినపడేశారు. దీంతో పీఎంవో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విజయసాయి రెడ్డితో పాటు.. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించి చీవాట్లు పెట్టినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినప్పటికీ.. రీటెండరింగ్‌ ప్రక్రియను ఆహ్వానించడమేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాల ఆశీస్సులతోనే నిర్ణయం తీసుకున్నామని విజయసాయి రెడ్డి చెప్పడం పట్ల కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తీవ్ర అసంతృప్తి ఉన్నారు. పైగా, రీటెండరింగ్‌కు మోదీ ఆశీస్సులున్నాయని విజయసాయిరెడ్డి, దాన్ని ఖండిస్తూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన ప్రకటనలు షెకావత్‌ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. 
 
ఇదేసమయంలో జల విద్యుత్‌ ప్రాజెక్టు టెండర్‌ రద్దును హైకోర్టు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలన్నింటిపైనా ఆయన తన శాఖకు చెందిన అధికారులతో సమీక్షించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అదేసమయలో పీఎంవో పిలుపుమేరకు ఢిల్లీ వెళ్లిన విజయసాయి, అజయ్ కల్లాంలు టెండర్లు రద్దు, రీ టెండరింగ్ విధానం, పీపీఏలో సమీక్షలపై వివరణ ఇచ్చి, నివేదికలు సమర్పించినట్టు సమాచారం. మొత్తంమీద విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు