సీఎం జగన్ హయాంలో గుడివాడ నియోజకవర్గంలో రూ.750 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి కొడాలి

బుధవారం, 31 మార్చి 2021 (21:20 IST)
గుడివాడ: సీఎం జగన్మోహనరెడ్డి హయాంలో గుడివాడ నియోజకవర్గంలో రూ.750 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం పెదకాల్వ సెంటర్లో రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన గుడివాడ - కంకిపాడు రోడ్డు విస్తరణ, రివిట్ మెంట్ పనులకు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి శంఖుస్థాపన, భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహనరెడ్డి నవరత్నాలను పటిష్టంగా అమలు చేస్తున్నారని చెప్పారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం జరగడం లేదని పదే పదే విమర్శలు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో గుడివాడ లాంటి 175 నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడివాడకు రూ.22 కోట్లతో బస్టాండ్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన ఏరియా ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థకు చేరితే రూ.12 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని కవుతరం నుండి నిడుమోలు వరకు రూ. 30 కోట్లతో రోడ్డును నిర్మిస్తున్నామన్నారు.

గుడివాడ పట్టణం పెదకాల్వ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు రూ. 3 కోట్ల 40 లక్షలతో 30 అడుగుల మేర సీసీ రోడ్డుకు శంఖుస్థాపన చేశామన్నారు. అలాగే గుడివాడ - కంకిపాడు రోడ్డులోని పెద ఎరుకపాడు దగ్గర నుండి మండల కేంద్రమైన పెదపారుపూడి వరకు రివిట్‌మెంట్ వాల్, 10 మీటర్ల రోడ్డును రూ.16 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. వీటితో పాటు 15 వ ఆర్ధిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్, ప్రభుత్వం ఇచ్చే అదనపు గ్రాంట్లు మొత్తం రూ.25 కోట్లతో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

గుడివాడ పట్టణంలో పేదలకు ఇళ్ళు ఇచ్చేందుకు రూ.94 కోట్లతో 181 ఎకరాల భూమిని కొనుగోలు చేశామన్నారు. మట్టి ఫిల్లింగ్, రోడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజ్ వ్యవస్థ వంటి మౌలిక వసతులకు మరో రూ.85 కోట్లు కేటాయించామన్నారు. 7 వేల ఇళ్ళ నిర్మాణానికి రూ. 140 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. చంద్రబాబు హయాంలో టీడ్కో గృహాల పేరుతో ఒకటి, రెండు ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వెళ్ళిపోయాడన్నారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా 8,912 టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యామన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన గత ప్రభుత్వ బకాయిలు రూ. 270 కోట్లు చెల్లించామన్నారు. గుడివాడ పట్టణంలో ఇచ్చే 17 వేల ఇళ్ళకు రూ.600 కోట్లు సీఎం జగన్ కేటాయించారన్నారు. రోడ్లు, బస్టాండ్, ఆసుపత్రులను రూ.150 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. గుడివాడ నియోజకవర్గంలోనే రూ. 750 కోట్లు, మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్పిటల్‌కు 45 ఎకరాల భూమిని సేకరించి రూ.550 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి తక్కువలో తక్కువగా రూ . 500 కోట్లు, ఎక్కువగా రూ . 1500 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నారన్నారు.
 
బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ - కంకిపాడు రోడ్డు నిర్మాణాన్ని ఇక్కడ ప్రజలు ఎంతో కాలంగా కోరుకుంటున్నారన్నారు. ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని మంత్రి కొడాలి నాని సీఎంను కోరగా రూ. 16. 10 కోట్లు మంజూరయ్యాయన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లో గుడివాడలో రెండు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు తెస్తామన్నారు. రూ. 3 కోట్లతో గుడివాడ పట్టణంలోని పార్క్ స్కూల్, ఏకేటీపీ బాలికల ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మోడల్ పాఠశాలగా నిలుపుతామన్నారు.

సీఎం జగన్ పాలనకు పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారన్నారు. త్వరలో జరిగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో అత్యధిక మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం తథ్యమన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని హయాంలో ఎన్నడూ లేని అభివృద్ధి గుడివాడ నియోజకవర్గంలో జరుగుతోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
   
సభకు వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ ఎం, పలువురు ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు