డాక్టర్ శిల్ప సూసైడ్‌ కేసు : ప్రొఫెసర్ల మాటలే ఈటెల్లా గుచ్చుకున్నాయ్...

బుధవారం, 8 ఆగస్టు 2018 (16:22 IST)
ప్రొఫెసర్ల మాటలే ఈటెలై మనసును బాధించాయి. చదువులు చెప్పాల్సిన గురువులే పడక గదిలోకి రమ్మన్నారు. పడక గదిలో తమను సుఖపెడితేనే పరీక్షల్లో పాస్ చేస్తామన్నారు. ఇలా సూటిపోటి మాటలతో వేధించారు. ఈ ప్రొఫెసర్ల మాటలే ఈటెలుగా మారాయి. అవి మనసుకు సూటిగా గుచ్చుకున్నాయి. ఫలితంగా యువ మహిళా డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుంది.
 
తన అకుంఠిత దీక్ష, పట్టుదలలతో ఉన్నత శిఖరాలను అధిరోహించి, యువ వైద్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య, చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణలో శిల్ప ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. దీనికి కారణం తిరుపతి రూయా ఆసుపత్రి హెడ్ డాక్టర్ రవికుమార్ కారణమని నిర్ధారించారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. 
 
నిజానికి 2015-16లో రుయాలో చేరింది. పీజీ చేస్తున్న సమయంలో అక్కడి ప్రొఫెసర్లు రవికుమార్, కిరీటి, శశికుమార్ లు తనను వేధిస్తున్నారని సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత గవర్నర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపి, శిల్ప మానసిక స్థితి సరిగ్గా లేదంటూ తేల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది.
 
అనంతరం ఇటీవల అంటే గత మేలో జరిగిన పీజీ పరీక్షల్లో శిల్ప ఫెయిల్ అయింది. తనను కావాలనే ఫెయిల్ చేశారని ఇంట్లో చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది కూడా. రీకౌంటింగ్ పెట్టించినా కూడా అదే ఫలితం రావడంతో తట్టుకోలేక పోయింది. ఫలితంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు