ప్లీజ్.. అంకుల్ అని పిలవకండి.. నన్ను బాలయ్య అని మాత్రమే పిలవండి అంటూ టీడీపీకి చెందిన యువ ప్రజా ప్రతినిధులకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి వచ్చిన బాలకృష్ణ సందడి చేశారు. మంగళవారం జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, శాసనసభ సమావేశాల విరామ సమయంలో బాలకృష్ణ టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అదేసమయంలో తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, బాలకృష్ణను ఉద్దేశించి 'నన్ను ఆశీర్వదించండి అంకుల్' అని కోరారు. దీనికి బాలకృష్ణ వెంటనే నవ్వుతూ.. 'నో అంకుల్.. ఓన్లీ బాలయ్య' అని చమత్కరించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
ఈ సరదా సంభాషణ అనంతరం, అక్కడున్న వారు బాలకృష్ణను 'అఖండ-2' సినిమా విడుదల గురించి ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, 'ఈ నెల 25న తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతోంది. ఆ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత మా సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అని బాలకృష్ణ వెల్లడించారు.
ఇదేక్రమంలో మంత్రి సంధ్యారాణి అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి ప్రచారం కల్పించాలని బాలకృష్ణను కోరారు. ఆమె విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తానికి, తనదైన శైలిలో బాలకృష్ణ చేసిన సందడితో టీడీఎల్పీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.