ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

ఠాగూర్

మంగళవారం, 3 జూన్ 2025 (11:42 IST)
తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసింది. రంగంపేట మండలం వడిసలేరు సమీపంలోని రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
 
రాజమండ్రి పట్టణంలోని కవలగొయ్యి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం సోమవారం కాకినాడ బీచ్ సందర్శనకు వెళ్లింది. సాయంత్రం సరదాగా గడిపి, రాత్రి సమయంలో కారులో తిరిగి రాజమండ్రి బయలుదేరారు. ఈ క్రమంలో, రంగంపేట మండలం వడిసలేరు వద్దకు రాగానే, రహదారి పక్కన నిలిపి ఉన్న ఒక ట్యాంకరు వారి కారు అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
 
ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో పాటు ఐదేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
 
ప్రాథమిక దర్యాప్తు అనంతరం, కారు డ్రైవర్ అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో రాజమండ్రి కవలగొయ్యిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు