తూర్పుగోదావరి : పిల్లి సుభాష్ చంద్రబోస్‌ స్వగ్రామంలో వైకాపా అభ్యర్థి ఓటమి

ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (11:36 IST)
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామంలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచారు. రామచంద్రాపురం నియోజకవర్గం హసన్‌బాదలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు.

రెండు విడత పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల టీడీపీ మద్దతుదారులు ముందజలో ఉన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామం హసన్‌బాదలో టీడీపీ మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. 

దీంతో స్థానిక నేతలు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఎన్నిఇబ్బందులు పెట్టినా టీడీపీ విజయాన్ని ఆపలేకపోయారని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. 

అదేవిధంగా ఏపీ మంత్రి కొడాలి నాని సొంతూరులో వైకాపా బలపరిచిన అభ్యర్థి చిత్తుగా ఓడిపోయారు. అంటే... టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఏకంగా 800 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించాడు. కొడాలి నాని స్వగ్రామం గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామం. ఈ గ్రామం సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి కొల్లూరి అనూష 800 ఓట్లతో భారీ విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 

తమ పార్టీ నేతలను మంత్రి కొడాలి నాని బూతులు తిట్టడాన్ని యలమర్రు గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారని, దీంతో కొడాలి నాని బలపర్చిన అభ్యర్థిని దారుణంగా ఓడించారని స్థానిక టీడీపీ నేతలు అన్నారు. ఈ విజయం చూసైనా కొడాలి తీరు మారాలని సూచించారు. 

మరోవైపు గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో 20 పంచాయతీలకుగాను తొమ్మిది గ్రామాల సర్పంచ్‌లుగా టీడీపీ మద్దతు అభ్యర్థుల విజయం సాధించారు. పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు