పర్యావరణ హితం సేంద్రీయ వ్యవసాయం... ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

శుక్రవారం, 4 అక్టోబరు 2019 (22:03 IST)
సహజ, సేంద్రీయ వ్యవసాయం వైపునకు రైతులు మరలాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల ద్వారా జరుగుతున్న సాగు ఫలితంగా కాలుష్యంతో పాటు పర్యావరణ విపత్తులకు అవకాశం  ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. 

సేంద్రీయ వ్యవసాయం పర్యావరణాన్ని పరిరక్షించడటంతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ఉపకరిస్తుందని గౌరవ గవర్నర్ పేర్కొన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ పురపాలక క్రీడా ప్రాంగణం ఆవరణలో దక్షిణ భారత గో అధారిత మూడవ రైతు సమ్మేళనం సందర్భంగా నిర్వహించిన జాతీయ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం భారతదేశపు పురాతన సంప్రదాయంగా అలనాటి రోజుల నుండి రైతులు అవలంభిస్తున్నారని గవర్నర్ గుర్తు చేసారు. పూర్వపు రోజుల్లో ఆవు పేడను రైతులు ఎరువుగా ఉపయోగించారని, ఇప్పుడు రైతులు తిరిగి అదే వ్యవస్థకు వెళుతుండటం శుభపరిణామమని బిశ్వ భూషణ్ అభిప్రాయపడ్డారు. 
 
పెట్టుబడి రహిత సహజ వ్యవసాయాన్ని పాటిస్తూ, ఆంధ్రప్రదేశ్ రైతులు రసాయన రహిత విధానాన్ని అందిపుచ్చుకోవటం ముదావహమన్నారు. గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం నేతృత్వంలో 3వ దక్షిణ భారత సేంద్రీయ రైతు సదస్సును విజయవాడలో ఏర్పాటు చేయగా, దేశం నలుమూలల నుండి విచ్చేసిన రైతులు తమ సేంద్రీయ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. స్టాల్స్ వద్ద ప్రదర్శించిన వివిధ సేంద్రీయ ఉత్పత్తుల సాగు విధానం గురించి గౌరవ గవర్నర్ రైతులను అడిగి తెలుసుకున్నారు.
 
వివిధ రకాల ఉత్పత్తులలో దాదాపు  103 దుకాణాలు ఏర్పాటు చేయగా, గౌరవ గవర్నర్ ఈ ఉత్పత్తుల సముదాయాలను ఆసక్తిగా తిలకించి, రైతులతో సంభాషించారు.  కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు,  స్ధానిక శాసన సభ్యుడు మల్లాది విష్ణు,  ప్రకృతి వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ,  సంఘం ఉపాధ్యక్షుడు, రైతు నేస్తం పౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు,  ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు