స్టైరీన్‌ గ్యాస్‌ ప్రభావం కొంప ముంచుతుందా?

గురువారం, 7 మే 2020 (18:58 IST)
విశాఖలోని గోపాలపట్నం ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషవాయువే ఈ స్టైరీన్‌.

ఈ ప్రమాదంలో స్టైరీన్‌ అనే గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఆ గాలిని పీల్చి ఇప్పటికే 11 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతటి భయంకరమైన స్టైరీన్‌ వాయువును ఎందుకు వాడతారు? ఆ గ్యాస్‌ ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది?
 
గోపాలపట్నం పరిధిలో గల ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో 1997లో దాదాపు 213 ఎకరాల విస్తీర్ణంలో ఎల్‌జి పాలిమర్స్‌ కంపెనీని నెలకొల్పారు. ఈ కంపెనీలో రోజూ 417 టన్నుల పాలిస్టిరిన్‌ ఉత్పత్తి చేస్తారు. స్టైరీన్‌ గ్యాస్‌ను ముడిసరుకుగా ఉపయోగించి పాలిస్టిరిన్‌ను తయారు చేస్తారు.

స్టైరీన్‌ గ్యాస్‌ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. 
 
ఇటువంటి ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే ఆ వ్యక్తికి వైద్య చికిత్సను అందించాలి. 'లాక్‌డౌన్‌ కారణంగా 45 రోజుల నుంచి పరిశ్రమలో ఎలాంటి పనులూ జరగకపోవడంతో స్టైరీన్‌ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మిగిలిన గ్యాస్‌ వాయువులతో పోలిస్తే ఇది చాలా బరువైన వాయువు. ఈ ప్రమాదం జరిగిన చోట 0.5 కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది. అలాగే 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొంతవరకూ అస్వస్థతకు గురి అవుతారు.

అయితే ఈ గ్యాస్‌ ప్రభావం ఒకటి, రెండు రోజుల వరకూ ఉంటుంది. స్టైరీన్‌ గ్యాస్‌ను పీల్చడం వల్ల ముక్కు, గొంతు దురదపెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం జరుగుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ గ్యాస్‌ను కనుక అధిక మోతాదులో పీలిస్తే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు