అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారే ఉండటం గమనార్హం. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు తరలించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో కైలాసపట్నం గ్రామానికి చెందిన ఏ.తాతబాయి (45), యాది గోవింద్ (45), రాజంపేటకు చెందిన దాడి రామలక్ష్మి (38), సామర్లకోటకు చెందిన నిర్మల (36), పురంపాప (40), వేణుబాబు (40), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (56), విశాఖకు చెందిన మనోహర్ (30)లు ఉన్నారు. వీరంతా బాణాసంచా తయారీ కేంద్రంలో కూలీ పని చేసేందుకు వచ్చి మృత్యువాతపడ్డారు. ఘటనా స్థలిని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పరిశీలించి, క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించాలని ఆదేశించారు.
మరోవైపు, ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోం మంత్రి అనితతో ఫోనులో మాట్లాడి ఈ ఘటనపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, ఈ బాణాసంచా పేలుడు ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని ఆమె అప్రమత్తం చేశారు.