వ్యక్తిగత దూషణలు చేస్తున్న సీఎం జగన్‌ ప్రచారాన్ని నిషేధం విధించాలి : పత్తిపాటి పుల్లారావు

ఠాగూర్

గురువారం, 2 మే 2024 (12:30 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో జగన్ హద్దులు దాటిపోతున్నారంటూ మండిపడ్డారు. ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం తక్షణం నిషేధం విధించాలని ఆయన కోరారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పై విధంగా డిమాండ్ చేశారు. 
 
'సీఎం జగన్‌ ప్రచారంపై ఈసీ తక్షణం నిషేధం విధించాలి. అబద్ధాలతో విపక్షాలపై ఆయన బురద చల్లుతున్నారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ను అనరాని మాటలతో దూషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌లాగే జగన్‌ ప్రచారంపైనా ఈసీ నిషేధం విధించాలి. ఆయన కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. స్థాయి దిగజారి వ్యక్తిగత జీవితాలపై కూడా జగన్‌ మాట్లాడుతున్నారు' అని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 
 
తెలంగాణాలో పోలింగ్ సమయం పొడగింపు... ఎందుకో తెలుసా? 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలో లోక్‍‌సభ స్థానాలకు పోలింగ్ జరిగితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కలిసి ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నారు. సాధారణంగా పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. కానీ, తెలంగాణాలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. వీటికితోడు వడగాలులు బలంగా వీస్తున్నాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెనుకంజ వేస్తారని భావించిన రాజకీయ పార్టీల నేతలు... పోలింగ్ సమయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ... తెలంగాణాలో మాత్రం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు