వైకాపా నుంచి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు రాంరాం...

వరుణ్

మంగళవారం, 18 జూన్ 2024 (14:15 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తుగా ఓటమిపాలైంది. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీకి దూరమవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త శిద్ధా రాఘవరావు వైకాపాకు టాటా చెప్పేశారు. ఆయన తన రాజీనామా లేఖను మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. తన వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకుమించి మరొక్క పదం ఆ రాజీనామా లేఖలో రాయలేదు 
 
శిద్ధా రాఘవరావు 2014లో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి గెలిచినపుడు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణాశాఖా మంత్రిగా పని చేశారు. ఆయన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, 2019 ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు ఒంగోలు నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తన కుమారుడు సుధీర్‌తో కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
 
గత ఐదేళ్లుగా అధికార వైకాపాలో కొనసాగిన ఆయన ముగిసిన ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, ఆయనకు అధిష్టానం అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను ప్రతిపాదించగా, అక్కడ పోటీ చేసేందుకు ఆయన ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఇపుడు ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు