జగన్‌కే అంతా అనుకూలం.. పవన్ బలంపై ఇప్పుడే అంచనా వేయలేం: ఉండవల్లి

సోమవారం, 18 జూన్ 2018 (13:24 IST)
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆర్జీ ఫ్లాష్‌ టీమ్ నిర్వహించే సర్వేలకు తిరుగుండదు. ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వేకు ఉన్న ట్రాక్‌ రికార్డు.. వందకు వందశాతం సక్సెస్‌ రేటును కలిగివుంది. ఎప్పటికప్పుడు ప్రజలనాడిని అందిపుచ్చుకోవడంలో ముందుంటుందనే నమ్మకాన్ని సంపాదించుకుంది.. అందుకే ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ డిసైడ్‌ చేస్తే ముందే వార్‌ వన్‌సైడ్‌ అవుతుందనే నానుడి రాజకీయ వర్గాల్లో ఉంది.
 
ఇక ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 110 సీట్లు లభిస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీకి 60 సీట్లు మాత్రమే దక్కనున్నాయని తేల్చి చెప్పింది. జనసేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేల్చి చెప్పింది. 
 
తాజాగా ఏపీలో రాజకీయ బలాబలాపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పుడు ప్రజల్లో వేవ్ వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉందన్నారు. 
 
అయితే ప్రజల్లో ఉన్న వేవ్‌ను మార్చగలిగే సామర్థ్యం సీఎం చంద్రబాబుకు ఉందని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు.. వైఎస్ జగన్‌‍కు సరైన ఎన్నికల టీమ్ లేదని వెల్లడించిన ఉండవల్లి... పవన్ కళ్యాణ్ బలంపై ఇప్పుడే ఓ అంచనా వేయలేమని చెప్పుకొచ్చారు. అయితే వైకాపా చీఫ్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిపోతే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనేది చెప్పలేమని ఉండవల్లి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు