ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ - పేరు "జై భీమ్"

శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (07:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీన ఈ పార్టీని దళిత నేత జడ శ్రవణ్ కుమార్ స్థాపించారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ శూన్యత నెలకొనివుందని, దీన్ని భర్తీ చేసేందుకే తాను కొత్త పార్టీని స్థాపించినట్టు ఆయన వెల్లడించారు. తమ పార్టీ ఏపీలోని అధికార వైకాపా ప్రజాప్రతినిధులను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. గత మూడేళ్లుగా సాగుతున్న వైకాపా దుర్మార్గపు అవినీతి పాలనను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
విజయవాడ గురువారం సాయంత్రం నిర్వహించిన ఆవిర్భావ సభలో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందన్నారు. 28 సంవత్సరాలకే న్యాయమూర్తి అయిన తాను పదేళ్లలోనే ఆ పదవిని వదిలి వచ్చేశానని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత బిడ్డలకు తాను మేనమామలా ఉంటానని హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత వారికి చేసిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోబోమన్నారు.
 
వైసీపీలోని దళిత నేతలను ఓడించేందుకే పార్టీని పెడుతున్నట్టు ప్రకటించారు. దళితులకు అందే 26 రకాల పథకాలను జగన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షీరాం మాటలే తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ అన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నించకుండా వదలనని శ్రవణ్ కుమార్ తేల్చిచెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు