ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ విభాగం మాజీ చీఫ్ సునీల్ కుమార్ను టీడీపీ కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేసింది. ముందస్తు అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్ళివచ్చినట్టు నిర్ధారణ కావడంతో పాటు ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి, వైకాపా మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజును వేధించి, చిత్రహింసలకు గురిచేసిన చేసినట్టు ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
ముఖ్యంగా, గత వైకాపా ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చెలామణి అయిన సునీల్ కుమార్ 2020 నుంచి 2024 మధ్యకాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారు. ఇది అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సునీల్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
వైద్యుడైన తన భర్త అడ్డు తొలగించుకునేందుకు ఓ భార్య తన ప్రియుడుతో కలిసి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హత్యాయత్నం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి (36) కాజీపేటలో క్లినికి నిర్వహిస్తున్నాడు.
గత నెల 20వ తేదీన కారులో ఇంటికి వెళుతుండగా బైకుపై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు భట్టుపల్లి శివారులో ఆయనపై దాడి చేశారు. సుత్తితో ఆయన తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత క్షతగాత్రుడుని గుర్తించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందడంతో వైద్యుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
మరోవైపు, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రియుడి మోజులో పడిన సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మారియా... సంగారెడ్డికి చెందిన తన ప్రియుడు ఎర్రోళ్ల శామ్యూల్, అతడి స్నేహితుడు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్కుమార్తో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో గత నెల 27వ తేదీన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.