విజయవాడ, గన్నవరంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో మాత్రం చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు కోర్టు మరోమారు రిమాండ్ పొడగించింది.
అదేసమయంలో నకిలీ పట్టాల ఇళ్ల కేసులో విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని విచారించినందున మళ్లీ కస్టడీ అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఆ సమయంలో వంశీ అస్వస్థతకు గురికావడంతో విచారణ సరిగా జరగలేదని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపినప్పటికీ న్యాయమూర్తి అంగీకరించకుండా కస్టడీ పిటిషన్ను కొట్టివేశారు.
మరోవైపు, ఇదే కేసులో వంశీకి విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో, పోలీసులు ఆయనకు వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరు వర్గాల విచారణ అనంతరం వంశీకి జూన్ 12వ తేదీ వరకు రిమాండ్ పొడగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.