మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సత్వర సహాయ చర్యలను ప్రారంభించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రభావిత ప్రాంతాలలో వున్న ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, చక్కెర కిలో ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ సరుకులన్నిటినీ వెంటనే పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనురుకి ఆదేశాలు జారీ చేసారు.
కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మొంథా తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను ధాటికి 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఇంకా అలల ఉధృతి భారీగా వుంది. అలాగే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేగవంతమైన గాలుల కారణంగా విద్యుత్, రైల్వే మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. పంటలు నీటమునిగాయి. పలువురు నిరాశ్రయులైనారు. ఈ తుఫాను ఇప్పటివరకు నలుగురు ప్రాణాలను బలిగొంది.