హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఏపీఎస్ ఆర్టీసీ టిక్కెట్లు.. ఎందుకు.. ఎలా?

ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (09:57 IST)
ఏపీఎస్ ఆర్టీసీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా, తిరుపతి, తిరుమలకు వెళ్లే బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు మరికొన్ని అదనపు బస్సులను నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం శ్రీవారి దర్శనం. ఆర్టీసీ బస్సు టిక్కెట్‌తో పాటు.. శ్రీవారి దర్శన టిక్కెట్‌ను బుక్ చేసుకునే సదుపాయం కల్పించడమే. 
 
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఎంచుకునే స్లాట్‌లో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లే అవకాశాన్ని కల్పించిన తర్వాత, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 
 
రోజుకు 1000 శీఘ్రదర్శనం టికెట్లను ఆర్టీసీ ప్రయాణికులకు కేటాయించగా, అన్ని టికెట్లూ అమ్ముడైపోతున్నాయి. దీంతో మరిన్ని టికెట్లను కేటాయించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. తద్వారా పడిపోయిన ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోవాలని భావిస్తున్నారు.
 
కాగా, వెంకన్న దర్శనంతో ఆర్టీసీకి కోటాను ఇవ్వాలని గతంలో టీటీడీ ఈఓను ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కోరగా, వెంటనే రోజుకు రెండు స్లాట్లలో 1000 టికెట్లను కేటాయించడం జరిగింది. దీంతో స్వామివారి వారి భక్తులు ఎటువంటి సిఫార్సులు లేకుండా సులువుగా, తక్కువ సమయంలో దర్శన భాగ్యాన్ని పొందే అవకాశం లభించింది.
 
దూర ప్రాంతాల నుంచి తిరుపతికి ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే వారు, అదేసమయంలో స్వామి దర్శనం నిమిత్తం కూడా రూ.300 చెల్లించి టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. దీంతో తిరుపతికి ప్రైవేటు బస్సుల్లో వెళ్లాలని భావించే వారు కూడా ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. టికెట్లకు ఎనలేని డిమాండ్ వచ్చింది. 
 
తిరుపతి మీదుగా తిరుమల చేరుకునే యాత్రికులకు సత్వర దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. గత నాలుగు రోజులుగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. టికెట్లు విడుదల చేసిన అన్ని రోజులకూ బుకింగ్స్ పూర్తయ్యాయి. దీంతో ఆర్టీసీ కోటాను మరింతగా పెంచాలని అధికారులు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు