మూడు రాజధానులు : సీఎం జగన్ నిర్ణయానికి 'గంట' స్వాగతం

శుక్రవారం, 20 డిశెంబరు 2019 (14:56 IST)
నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటనను తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అన్ని విధాలా అర్హమైనదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానిగా విశాఖ వంద శాతం సరైనదనేది తన అభిప్రాయమన్నారు. విశాఖపట్టణం పౌరుడిగా, ఈ నగరంతో తనకున్న అనుబంధం కారణంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను తాను స్వాగతించానని తెలిపారు. రాజధానిగా విశాఖ సరైన నగరమని తాను గతంలో ఎన్నో సార్లు చెప్పానని అన్నారు. 
 
అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కూడా విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని తాను డిమాండ్ చేశానని చెప్పారు. అందుకే జగన్ ప్రకటన చేసిన వెంటనే దాన్ని స్వాగతిస్తూ తాను ట్వీట్ చేశానని వివరించారు. అయితే, విశాఖ అంశంపై పార్టీ పరంగా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చని గంటా అన్నారు. 
 
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు... రాజధాని అక్కడే ఉండాలని తమ అధినేత చంద్రబాబు అనుకోవచ్చని, అది తమ పార్టీ స్టాండ్ కావచ్చని... అయితే విశాఖను రాజధానిగా చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా ఎవరూ కాదనలేని పరిస్థితి ఉందని... తానే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన ఇతర నేతలు ఎవరూ కూడా కాదనలేరని అన్నారు. మరోవైపు, జగన్ ప్రకటనను గంటా స్వాగతించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు