అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి: దివ్య తేజ‌శ్విని కుటుంబానికి హోంమంత్రి సుచ‌రిత ప‌రామ‌ర్శ‌

శనివారం, 17 అక్టోబరు 2020 (23:01 IST)
ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దివ్యను దారుణంగా చంపిన ఉన్మాదికి విధించే శిక్ష రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలి కోరారు. ఆడపిల్లలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్ష ఉండాలని లేఖలో పేర్కొన్నారు.
 
మా పాపకు తక్షణ న్యాయం జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీస్తురాజపురంలో చాలామంది గుట్కా, గంజాయి, మద్యానికి బానిసై ఉన్మాదులుగా మారుతున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని శనివారం రాసిన లేఖలో కోరారు. ఈ సంద‌ర్భంగా దివ్య కుటుంబాన్ని శనివారం సాయంత్రం హోంమంత్రి సుచరిత పరామర్శించారు. దివ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భగా తమకు న్యాయం చేయాలని కోరుతూ లేఖను హోంమంత్రికి అందించారు.
 
బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని సుచరిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘దివ్య ఘటన బాధాకరం. ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివ్య కుటుంబానికి అండగా ఉంటాం. తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, 302 కేసు నమోదు చేశాం. 
 
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులకు చెప్పాలి. 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22)పై బుడిగి నాగేంద్రబాబు(25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు