బోటు ప్రమాద ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:46 IST)
బోటు ప్రమాద ప్రాంతంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను మఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పర్యవేక్షించారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన ముఖ్యమంత్రి బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాద ఘటనుంచి బయటపడి చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో వారిని కలుసుకుని ధైర్యం చెప్పారు. డాక్టర్లు అందిస్తున్న చికిత్స, ఇతరత్రా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
పలువురు బాధితులను ఆయన స్వయంగా పరామర్శించారు. ఉప్పల్‌కు చెందిన జానకిరామారావును పరామర్శించిన సీఎం కుటుంబాన్ని కోల్పోయిన జానకి రామారావుకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో భుజానికి గాయం, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌ జిల్లా కరిపికొండెం బాధితులను కూడా పరామర్శించారు. 
 
బాధితులందరికీ మంచి వైద్యం అందించాలంటూ వైద్యులను ఆదేశించారు. కోలుకున్న తర్వాతనే వారందన్నీ ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. దేనికీ వెనుకాడవద్దని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆస్పత్రివద్దే సీఎం కలసుకున్నారు. మృతదేహాలు గ్రామాలకు తరలించేందుకు అన్నిఏర్పాట్లూ చేయాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 
ముఖ్యమంత్రి వెంట మంత్రులు కన్నబాబు, ఆళ్లనాని, పినిపె విశ్వరూప్, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, తెలంగాణమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు