చంద్రగిరి పరిధిలో నూతన వధూవరులకు బంగారు తాళిబొట్టు, పట్టువస్త్రాలు, మెట్టెల కానుక

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (06:20 IST)
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.  చంద్రగిరి పరిధిలో వివాహం చేసుకునే కొత్త జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు,మెట్టెలతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాలు  కానుకగా అందించే కార్యక్రమాన్ని తలపెట్టారు.

ఈ కానుకలను అందించే ప్రక్రియను టీటీడీ చైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం ఇందుకు తుమ్మల గుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణం వేదికైంది. వివాహం చేసుకోబోతున్న ఏడు జంటలకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఈ కానుకలు అందించి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా  సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి శాసనసభ్యులు, తుడా చైర్మన్  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.  నియోజక వర్గానికి చెందినవారు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుక అందించే కార్యక్రమం శాశ్వతంగా నిర్వహిస్తున్నట్లు  చెప్పారు.

గత 12 ఏళ్లుగా తుమ్మల గుంట లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకునే జంటలకు ఈ కానుకలు ఇసున్నట్లు తెలిపారు. కాగా, ఇకపై చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వధువు లేదా వరుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుకలన్నీ అందజేసే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 

కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా తుమ్మలగుంటలో వివాహం చేసుకునే జంటలకు బంగారు తాళిబొట్టు, మెట్టెలు, పట్టుబట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ఇకపై నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కడ వివాహం చేసుకున్న ఈ కానుకలు అందజేస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు