చంద్రగిరిలో రూ. 20 కోట్లతో పాఠశాలల ఆధునీకరణ

బుధవారం, 25 ఆగస్టు 2021 (09:27 IST)
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రూ.20 కోట్ల నిధులతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. చెవిరెడ్డి నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలలో మొత్తం 122 ప్రభుత్వ పాఠశాలలకు నాడు- నేడు పనులతో సకల సౌకర్యాలు సమకూరాయన్నారు. మరుగుదొడ్లు, మంచినీటి వసతి, ఆట స్థలాలు, పచ్చని చెట్లు, అందమైన పెయింటింగ్స్ తో సరికొత్త అందాలను అద్దుకున్నాయని వివరించారు.

సకల హంగులతో ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం సంతరించుకున్నాయన్నారు. సీఎం విద్యారంగం పట్ల చూపుతున్న చొరవ విద్యార్థులు, తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారంజక పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులవుతున్నారని తెలియజేశారు.

పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో సీఎం జగనన్న విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతుగా అంకితభావంతో పనిచేయాలని కోరారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు.

నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. వ్యాక్సిన్ పట్ల అపోహల కారణంగా ఎవరైనా వేసుకోకపోతే అట్టి వారికి అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకునేలా దృష్టి సారించాలన్నారు. 
 
యువత ఓటు హక్కు పొందేలా చర్యలు
రాష్ట్ర ఎన్నికల సంఘం యువత ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించిందన్నారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యువత తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హత కలిగి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి కూడా అవకాశం ఉందని గుర్తు చేశారు. ఈ ప్రక్రియ అక్టోబరు 31 వరకు ఉంటుందని తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు