APSTRC ఉద్యోగులకు శుభవార్త: జీతాలతో పాటు అలవెన్సులు

మంగళవారం, 12 డిశెంబరు 2023 (17:11 IST)
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఓ వైపు పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను మారుస్తున్నారు. 
 
మరోవైపు పలు రంగాల్లోని సమస్యలపై దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారాలను చూపుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించింది. 
 
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు, భత్యాలు చెల్లించాలన్నది జగన్ సర్కార్ తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఒకటి. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులకు వేర్వేరుగా వేతనాలు, అలవెన్సులు ఇస్తున్నారు. 
 
అంతే కాకుండా... విలీనానికి ముందు ఉన్న వేతనాలు, అలవెన్సులనే ఒకేసారి చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వీటిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి నెలా... ఆర్టీసీ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వాలని నిర్ణయించింది. జీతాలతో పాటు విధి ఆధారిత అలవెన్సులు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ట్రెజరీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 
 
వచ్చే నెల, జనవరి 2024 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని.. వచ్చే నెలలో రాత్రిపూట, డే ఔట్ అలవెన్సులు, ఓవర్ టైం అలవెన్సులు కూడా జీతాలతో పాటు చెల్లిస్తామని స్పష్టం చేసింది. దీంతో 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు