జగన్‌కు షాకివ్వనున్న మరో ఇద్దరు వైకాపా నేతలు!

ఠాగూర్

శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (13:13 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఇద్దరు వైకాపా నేతలు షాకివ్వనున్నారు. వారిద్దరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. అప్పటి నుంచి ఆ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. 
 
ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే జగన్‌కు సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు వైకాపాను వీడారు. ఇపుడు మరో ఇద్దరు నేతలు సిద్ధమయ్యారు.
 
వారిలో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజులు ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే వైకాపాను వీడుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. 
 
కాగా, ఇప్పటికే సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమతమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో పాటు వైకాపాను వీడిని విషయం తెల్సిందే. నిజం చెప్పాలంటే ఇపుడు పార్టీని వీడుతున్నవారంతా జగన్‌కు అత్యంత సన్నిహితులు. 
 
పైగా నమ్మిన బంటుల్లా ఉన్నారు. అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్లే వైసీపీకి టాటా చెప్పేస్తుంటే కిందిశ్రేణి నాయకత్వం కూడా వారి వెంట నడుస్తుంది. దీంతో జిల్లాల్లో వైకాపా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉత్పన్నమైంది. 
 
కాగా, ఈ జిల్లాకు చెందిన, జగన్కు ఆత్మీయుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్టీకే కాకుండా.. ఏకంగా రాజకీయాలకే గుడ్బై చెప్పారు. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. 
 
ఇక మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు వైసీపీకి టాటా చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. బాలినేని జగన్నే కలిసి ఇక ఉండలేనని చెప్పి వచ్చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి జనసేనలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. 
 
ఉదయభాను కూడా పవన్‌తో సమావేశమై 22న ఆ పార్టీలో చేరతానని ప్రకటించారు. కీలక నేతలు చేజారకుండా జగన్ బుజ్జగిస్తున్నా వినిపించుకోవడం లేదు. వైసీపీలో కొనసాగితే భవిష్యత్ ఉండదన్న ఆలోచనలతోనే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు