భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య.. ఎక్కడ?

బుధవారం, 27 జనవరి 2021 (11:33 IST)
భార్య కాపురానికి రాలేదనీ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒకటి గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని మందపాడు గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మందపాడు గ్రామానికి చెందిన మేరుగ మరియదాసు(50)కి తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన నాగమణితో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కుమార్తెల వివాహాలు జరిపి అప్పుల పాలయ్యాడు. 
 
నిడుముక్కల గ్రామంలో ఉన్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలని మరియదాసు తన భార్యకు చెప్పగా నాగమణి అందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ గుంటూరులో వేర్వేరుగా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో కాపురానికి రావాలంటూ భార్యను పలుమార్లు కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో నిడుముక్కల గ్రామానికి వచ్చిన మరియదాసు వరండాలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటాద్రి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు