'సంగం' పాల డైరీ ఎండీకి కరోనా వైరస్ : ధూళిపాళ్ళ పరిస్థితేంటి?

మంగళవారం, 4 మే 2021 (12:39 IST)
గుంటూరు జిల్లాలోని సంగం పాల డైర ఎండీకి కరోనా వైరస్ సోకింది. ఈయనకు జైలులో వైరస్ సోకడం గమనార్హం. ఈయనతో పాటు ఉన్న టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కూడా ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు. 
 
కాగా, సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడిన‌ ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను ఏపీ ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం వీరంతా రాజమండ్రి జైలులో ఉంటున్నారు. 
 
ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేద‌న్న విష‌యంపై ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ దీనిపై జైలు సూపరింటెండెంట్‌ రాజారావు స్పందిస్తూ పూర్తి వివ‌రాలు తెలిపారు. గోపాలకృష్ణన్‌కు కరోనా నిర్ధారణ అయింద‌ని, దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివ‌రించారు. 
 
ఆయ‌న‌లో సోమవారం మధ్యాహ్నం క‌రోనా లక్షణాలు క‌న‌ప‌డ్డాయ‌ని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు త‌లెత్తాయ‌ని అందుకే జైలు అధికారులు నిన్న రాత్రి క‌రోనా పరీక్షలు చేయించార‌ని ఆయ‌న చెప్పారు. దీంతో ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింద‌ని వివరించారు. అలాగే, జైలులో ఉన్న సహకారశాఖ మాజీ అధికారి గురునాథం పాటు ధూళిపాళ్ల నరేంద్రకు మంగళవారం క‌రోనా పరీక్షలు చేయిస్తామని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు