24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో మరోసారి భారీ వర్షాలు..

సెల్వి

ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 
 
దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 
 
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. తెలంగాణలోనూ వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు