రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టీసీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్

ఠాగూర్

శనివారం, 7 సెప్టెంబరు 2024 (10:29 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా వెలిసే గణేశ్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 
 
అలాగే, నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ యేడాది వినాయకుని మండపాలకు తమ ప్రభుత్వం విద్యుత్‌ను ఉచితంగా అందిస్తుందని ముఖ్యమంత్రి ఇదివరకు ప్రకటించారు.
 
కాగా, ఖైరతాబాద్ గణేశుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తొలి పూజ ఉంటుంది. ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 
అదేవిధంగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు